వాషింగ్టన్: ఉత్తరకొరియాపై బెదిరింపులకు పాల్పడటం ఇకనైనా అమెరికా ఆపేయాలని చైనా అంటోంది. ఎవరెన్ని హెచ్చరికలు చేస్తున్న తన ధోరణిలో ఉంటున్న ఉ.కొరియాపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా పలు దేశాలు సూచిస్తుంటే.. చైనా మాత్రం అందుకు విరుద్ధంగా మాట్లాడుతుండటం గమనార్హం. బెదిరింపులు ఆపేసి.. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని హితవు పలికింది. ఓ కార్యక్రమంలో వాషింగ్టన్లో చైనా రాయబారి కు తియాంకి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘ఉ.కొరియాపై అమెరికా బెదిరింపులకు పాల్పడటం ఆపేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. సంధి కోసం ఆ దేశంతో ఎలా చర్చలు జరపాలనే దానికి సంబంధించి మార్గాలను అన్వేషిస్తే బాగుంటుంది’ అని తియాంకి అభిప్రాయపడ్డారు. చైనా వాణిజ్యాన్ని అణగదొక్కడానికి ఆంక్షలు విధించే యోచనలో అమెరికా ఉందని జిన్షుయా న్యూస్ ఏజెన్సీ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఉ.కొరియా మాదిరిగా చైనాపైనా ఒత్తిళ్లు తీసుకొచ్చి, ఆంక్షలు విధించాలని ప్రయత్నిస్తే అందుకు అమెరికన్లే మద్దతు ఇవ్వబోరని ఆయన పేర్కొన్నారు.