ఆన్లైన్ లో పెళ్లి చేసుకోవడానికి కేరళ హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఒమిక్రాన్ కారణంగా తమ వివాహం ఆగిపోతుందేమోనని ఓ న్యాయవాదుల జంట కేరళ హైకోర్టును ఆశ్రయించగా ధర్మాసనం వారికి అండగా నిలిచింది. రింటు థామస్ (25), అనంత కృష్ణన్ హరికుమార్ లు న్యాయవాదులు. ముందుగా నిర్ణయించిన ప్రకారం వీరి పెళ్లి గురువారం జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుతం బ్రిటన్ లో ఉన్న అనంత కృష్ణ హరికుమార్ నాయర్ బుధవారం స్వస్థలానికి రావడానికి అంతా సిద్ధం చేసుకున్నాడు. ఒమిక్రాన్ నేపథ్యంలో ఆయన రావడానికి సాధ్యం కాకపోవడంతో ఆన్ లైన్ లో పెళ్లి చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో ఆన్ లైన్ లో వీరి పెళ్లికి చట్ట ప్రకారం తగిన ఏర్పాట్లు చేయాలని వివాహాల అధికారిని హైకోర్టు ఆదేశించారు.