హర్యానాలోని హిస్సార్ అనే ప్రాంతంలో దారుణ ఘటన జరిగింది. మూఢ నమ్మకాల మత్తులో ఇంటి పెద్ద కుటుంబాన్ని చంపి, తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా చేస్తే మోక్షం లభిస్తుందని భావించి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. హిస్సార్ జిల్లాలోని నంగ్తాలా ప్రాంతానికి చెందిన రమేష్ అనే వ్యక్తి పెయింటర్గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారు. రమేష్కు మూఢ నమ్మకాలను ఎక్కువగా నమ్ముతుంటాడు. ఆ మూఢ నమ్మకాల మూలంగా తన కుటుంబాన్ని చంపి, తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. గత పౌర్ణమి రోజున కుండలో పాయసం వండాడు. అందరూ పూజలో పాల్గొన్నారు. అందరికీ పెద్ద బొట్లు పెట్టి రమేష్ పూజ చేశాడు. తర్వాత ఆ పాయసాన్ని భార్య, కొడుకు, ఇద్దరు కూతుర్లు తిన్నారు. తిన్న కొంతసేపటికే వాళ్లంతా స్పృహ కోల్పోయారు. ఆ తర్వాత రమేష్ తాను అనుకున్న విధంగా అత్యంత పాశవికంగా ఒక్కొక్కరిని నట్టింట్లోకి తీసుకొచ్చి చంపేశాడు.
ఒక గదిలో పెద్ద కూతురు అనుష్క, చిన్న కూతురు దీపిక ఉన్నారు. మరో గదిలో రమేష్ భార్య సవిత, 11 ఏళ్ల కొడుకు కేశవ్ ఉన్నారు. వారిలో ఒక్కొక్కరిని నట్టింట్లోకి తీసుకొచ్చి ఇనుప రాడ్తో కొట్టి చంపాడు. అందరూ ప్రాణాలు కోల్పోయారు. ఒక్కొక్కరి తలపై రెండు నుంచి మూడు సార్లు కొట్టినట్లు తెలిసింది. అందరినీ చంపేశాక రమేష్ ఇంట్లో గోడపై ‘అందరూ నిద్రిస్తున్నారు. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది’ అని రాశాడు. ఆ మృతదేహాలను ఇంట్లో ఉంచుకుని మూడు రోజుల పాటు రమేష్ అదే ఇంట్లో ఉన్నట్లు తెలిసింది. అంతేకాదు సూసైడ్ నోట్ మాదిరిగా ఒక డైరీలో 11 పేజీల్లో తాను అనుకున్నది రాసి రమేష్ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ‘ఈ ప్రపంచం నా లాంటి వాళ్లు జీవించడానికి సరైంది కాదు. రాక్షస మనస్తత్వాలు కలిగిన వాళ్లంతా జీవిస్తున్నారు. నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోవాలనుకుంటున్నాను. కానీ నేను వెళ్లిపోతే భార్యాపిల్లలు పరిస్థితి ఏంటనే ఆలోచన నాకు వచ్చింది. నాకు వాళ్లంటే చాలా ఇష్టం. అందుకే వాళ్లను చంపేసి నేనూ చనిపోవాలని కరెంట్ వైర్ పట్టుకున్నాను. కానీ నాకు షాక్ కొట్టలేదు. అందుకే రోడ్డుపైకి వెళుతున్నాను’ అని ఆ డైరీలో రాసి ఉంది. అగ్రోహ బర్వాలా రోడ్డులో ఓ గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టి రమేష్ చనిపోయాడు. ఇలా కుటుంబమంతా మూఢ నమ్మకాల కారణంగా బలైపోయింది.