భర్త పెట్టే వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏపీలోని కర్నూలులో జరిగింది. పోలీసుల కథనం వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలులో పాతబస్తీ బాపూజీనగర్కు చెందిన ఏ.భారతి(28) సి.బెళగల్ మండలం ఇనకండ్ల ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తోంది. ఆమెకు ఎనిమిదేళ్ల క్రితం మేనత్త కుమారుడు గోపీకృష్ణతో వివాహం జరిగింది. అతను స్థానిక గాంధీనగర్ సచివాలయంలో డిజిటల్ సహాయకుడిగా పనిచేస్తున్నాడు. వారికి ఇంతవరకు సంతానం కలుగలేదు. దీంతో కొంతకాలంగా భర్త గోపీకృష్ణ ఆమెను అనుమానిస్తూ, గొడ్రాలివని అవమానించాడు. దీంతో ఆమె మనస్తాపానికి గురై మంగళవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భర్త వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు మృతురాలి అక్క సుశీలమ్మ ఫిర్యాదు చేశారు. కర్నూలు వన్ టౌన్ పోలీసులు గోపీకృష్ణపై ఆత్మహత్య ప్రేరణ చట్టం కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.