దక్షిణాఫ్రికాలో గత 3 వారాలుగా రోజువారీ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కరోనా పరీక్ష నిర్వహించిన ప్రతి నలుగురిలో దాదాపు ఒకరికి కరోనా సోకినట్లు తేలుతోంది. దీంతో ఆ దేశ అధ్యక్షుడు సిరిల్ రామఫోసా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఒమిక్రాన్ వేరియంట్ వెలుగు చూసిన తరుణంలో కరోనా ఫోర్త్ వేవ్ కూడా ఊహించినదేనని ఆయన గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు కరోనా నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
గడిచిన వారం రోజుల్లో దక్షిణాఫ్రికాలో కేసుల సంఖ్య 5 రెట్లు పెరిగింది. 2 వారాల క్రితం కరోనా పాజిటివిటీ రేటు 2 శాతం ఉండగా.. ప్రస్తుతం అది 25 శాతానికి చేరుకుంది. ఇలా దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ ఎదుర్కొంటున్న దశలో ఇన్ఫెక్షన్ రేటు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్యరంగ నిపుణులు అంచనా వేసినట్లు ఆ దేశ అధ్యక్షుడు సిరిల్ రామఫోసా పేర్కొన్నారు. దక్షిణాఫ్రికాలో 2 వారాల క్రితం నిత్యం వందల సంఖ్యలో వెలుగుచూసిన పాజిటివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 10 వేలు దాటింది.