ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ కీచక పోలీసు అధికారి. ఈ ఘటనలో బాధితురాలు గర్భం దాల్చడంతో గుట్టుగా అబార్షన్ చేయించాడు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా కళియకోవిలై పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఇదే ప్రాంతానికి చెందిన ఓ మహిళ (32)కు వివాహమైంది. భర్తతో విడాకులు తీసుకుని మరో వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ప్రియుడు మోసం చేయడంతో ఫిర్యాదు చేసేందుకు ఆమె పోలీస్ స్టేషన్ కు వెళ్లింది.
బాధితురాలిపై కన్నేసిన అప్పటి సబ్ ఇన్ స్పెక్టర్ సుందర లింగం (40) ఆమెకు సాయం చేస్తున్నట్లుగా నమ్మించి పలు చోట్లకు తీసుకెళ్లాడు. ఆ సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో సదరు మహిళ గర్భం దాల్చింది. అనంతరం ఆమెను వైద్య పరీక్షల పేరుతో తీసుకెళ్లి గుట్టుగా అబార్షన్ చేయించాడు. ఇందుకు అతడి స్నేహితులు సహకరించారు. ఈ వ్యవహారంపై బాధితురాలు పలుమార్లు ఉన్నతాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని దీంతో బాధితురాలు కుళిత్తురై కోర్టును ఆశ్రయించారు.
విచారించిన న్యాయమూర్తి.. సుందరలింగంతో పాటు ఎనిమిది మందిపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. కోర్టు ఆదేశాలతో మార్తాండం మహిళా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.