ఏ మాత్రం పబ్లిసిటీని ఇష్టపడని ఓ మనిషి, కనీసం డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. కేవలం కామన్ సెన్స్ని పెట్టుబడిగా పెట్టి సుమారు లక్షా యాభై వేల కోట్ల రూపాయలకు అధిపతి అయ్యాడు. రాధా కిషన్ దమానీ వ్యాపారమే జీవన విధానంగా బతికే మర్వాడీ కుటుంబంలో 1954న జన్మించాడు. రాజస్థాన్లోని బికనేర్లోనే ఆయన విద్యాభ్యాసం జరిగింది. ఆ తర్వాత ఆయన తండ్రి శివ కిషన్ దమానీ ముంబై స్టాక్ ఎక్సేంజీలో బ్రోకర్గా పని చేయడానికి కుదరడంతో ఆ కుటుంబం ముంబైకి మకాం మార్చింది. రాధా కిషన్కి గోపి కిషన్ అనే సోదరుడు కూడా ఉన్నాడు. అత్తెసరు మార్కులతోనే చదువు నెట్టుకొస్తూ ఎలాగొలా ముంబై యూనివర్సిటీలో బీకాంలో సీటు సాధించినా మొదటి ఏడాది తర్వాత కాలేజీకి వెళ్లనంటూ భీష్మించుకుని కూర్చున్నాడు. దీంతో ఇంట్లో వాళ్లు అతని చేత బాల్ బేరింగ్ బిజినెస్ పెట్టించారు. తండ్రితో కలిసి సోదరుడు గోపి దమానీ స్టాక్ మార్కెట్ బ్రోకరేజీ పనులు చూసుకునే వాళ్లు. ఇటు పెద్దగా చదువు కోకుండా అటు బిజినెస్లో చురుగ్గా వ్యవహరించని రాధా కిషన్పై తండ్రికి ఎప్పుడూ అనుమానమే. అయితే రాధా కిషన్కి 32 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు అకస్మాత్తుగా శివ్ దమానీ మరణించాడు. దీంతో తండ్రి స్థానంలో అయిష్టంగానే స్టాక్ మార్కెట్లోకి వచ్చాడు దమానీ.
స్టాక్ మార్కెట్ అంటేనే గందరగోళం. కొనేవాళ్లు, అమ్మేవాళ్లలతో హడావుడిగా ఉంటుంది. కానీ రాధకిషన్ దమానీ ఇందుకు విరుద్ధంగా నెమ్మదిగా ఉండేవాడు. అతని పేరేంటో కూడా తోటి బ్రోకర్లకి తెలిసేది కాదు. మార్కెట్లో అతను ప్రాతినిథ్యం వహించే జీఎస్ అనే బ్యాడ్జ్ అతని షర్ట్పై ఉంటే అదే పేరుతో జీఎస్ అనే ఎక్కువ మంది పిలిచేవారు. హడావుడి చేయకపోయినా అక్కడున్న వాళ్లని గమనిస్తూ మార్కెట్ పల్స్ని మాత్రం బాగా గమనించే వాడు. రాధ కిషన్ దమానీ స్టాక్ మార్కెట్లో కెరీర్ ప్రారంభించినప్పుడే మరో బిగ్బుల్, స్టాక్ మార్కెట్ స్కామర్ హర్షద్ మెహతా కూడా స్కాక్ మార్కెట్లో అడుగు పెట్టాడు. తెర వెనుక యంత్రాంగం నడుపుతూ మార్కెట్ను పైకి లేపడంలో హర్షద్కి పెట్టింది పేరు. అతనికి పోటీగా మార్కెట్లో నిలిచింది ట్రిపుల్ ఆర్లో రాధాకిషన్ దమానీ మూల స్థంభం. ఆ రోజుల్లో హర్షద్కి పోటీగా రాధా కిషన్, రాకేశ్ ఝున్ఝున్వాలా, రాజ్ అనే ముగ్గురు ట్రిపుల్ ఆర్గా పోటీ ఇచ్చారు. అయితే వీళ్లపై ఎక్కువ సార్లు హర్షద్దే పై చేయి అయ్యింది. అయినా సరే పట్టు వదలకుండా పోటీలో నిలిచారంటే దానికి కారణం దమానీనే.
ఓ కంపెనీ టైర్స్ షేర్ల విషయంలో హర్షద్ మెహెతా, ట్రిపుల్ ఆర్ల మధ్య పోటీ నెలకొంది. ఆ కంపెనీ షేర్లు పెరుగుతాయంటూ హర్షద్ బుల్ జోరు కొనసాగిస్తే, ఆ షేర్లు పడిపోతాయంటూ ట్రిపుల్ ఆర్ బేర్ వైపు నిల్చుంది. హర్షద్ ఎత్తులతో చాలా రోజుల పాటు ఆ కంపెనీ షేర్లు పడిపోలేదు. మరో వారం గడిస్తే ఇల్లు, వాకిలి అమ్మేసి నడి రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి ట్రిపుల్ ఆర్ బృందానికి ఎదురైంది. అయితే హర్షద్ పాచికలు పారక కృత్రిమంగా పెంచిన ఆ కంపెనీ టైర్ల ధరలు పడిపోవడంతో దమానీ బృందం అప్పుల ఊబి నుంచి బయటపడ్డారు. ఆ తర్వాతి కొద్ది రోజులకే హర్షద్ స్కాం వెలుగు చూడటంతో పరిస్థితి మారిపోయింది. హడావుడి చేయకుండా నిదానంగా ఆలోచిస్తూ మార్కెట్ ఎత్తులు వేసే రాధా కిషన్ దమానీ వైఖరి ఆయన్ని మార్కెట్లో మరో ఎత్తుకి తీసుకెళ్లింది. 1992 నుంచి 1998 వరకు రాధి కిషన దమానీ కొనుగోలు చేసిన కంపెనీ షేర్ల విలువ బాగా పెరిగింది. వీఎస్టీ, హెచ్డీఎఫ్సీ, సుందరం ఫైనాన్స్ ఇలా అన్ని కంపెనీలు లాభాలను కళ్ల చూశాయి. బేర్ మార్కెట్ను అంచనా వేసి తక్కువ ధర షేర్లు కొన్ని లాంగ్టర్మ్లో భారీ లాభాలను పొందే వ్యూహం అమలు చేశాడు. పదేళ్లు తిరిగే సరికి వందల కోట్ల ఆస్తికి అధిపతి అయ్యాడు.
ముంబై నగర శివార్లలో పువై ప్రాంతంలో చవగ్గా స్థలం కొని ఏర్పాటు చేసి కిరాణ వస్తువుల నుంచి బట్టలు, ఎలక్ట్రానిక్స్, గ్రూమింగ్ వరకు అన్ని వస్తువులు ఓకే చోట దొరికేలా డీ మార్ట్ హైపర్ మార్కెట్ని ఏర్పాటు చేశాడు. ప్రతీ వస్తువుని ఎంఆర్పీ కంటే తక్కువ ధరకే అమ్మడం ప్రారంభించాడు. నెమ్మదిగా డీ మార్ట్ విజయ పరంపర మొదలైంది. డీ మార్ట్ ప్రారంభించిన తర్వాత పదేళ్లు గడిచే సరికి స్టోర్ల సంఖ్య 1 నుంచి పదికి పెరిగింది. అయితే మా సిటీలో కూడా డీమార్ట్ ఉంటే బాగుండు అనుకునే వారి సంఖ్య లక్షల్లోకి చేరింది. అందుకు తగ్గట్టే మరో పదేళ్లు గడిచే సరికి డీమార్ట్ స్టోర్ల సంఖ్య దేశ వ్యాప్తంగా 220కి చేరుకుంది. డీ మార్ట్ పబ్లిక్ ఇష్యూకి 2017లో వెళ్లగా 145 శాతం అధిక ధర నమోదై రికార్డు సృష్టించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూసుకున్నదే లేదు. ఆగస్టు 19న ఆయన పోర్ట్ఫోలియోలో ఉన్న ఐదు కంపెనీలు విపరీతమైన ఆదాయాన్ని సంపాదించి పెట్టాయి. దీంతో ఒక్కసారిగా ఆయన ఆదాయం 19.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇందులో 4.1 బిలియన్ డాలర్లు ఈ ఒక్క ఏడాదిలోనే ఆయన ఖాతాలో వచ్చి చేరింది.