జవాద్ తుపాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. తీర ప్రాంత జిల్లాల్లో సహాయక చర్యల కోసం N.D.R.F., O.D.R.F.తో కూడిన 266 బృందాలను రంగంలోకి దించింది. తుపానును ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు ఒడిశా స్పెషల్ రిలీఫ్ కమిషనర్ వెల్లడించారు. 14 తీర ప్రాంత జిల్లాలను అలర్ట్ గా ఉండాలని సూచించినట్టు స్పష్టం చేశారు. సమయం గడుస్తున్న కొద్దీ. పరిస్థితులపై మరింత స్పష్టత వస్తుందన్నారు. 24 NDRF, 158 రాష్ట్ర అగ్నిమాపక సేవల బృందాలు, 33 ODRFను ఆయా ప్రాంతాల్లో మోహరించాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను తరలించేందుకు చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుపానుగా బలపడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.దీంతో సాయంత్రం నుంచే భారీ నుంచి అతి భారీ వర్షాలతోపాటు.. గంటకు సుమారు 100 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉందని IMD వివరించింది.