ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నరకం చూస్తున్న వాహనదారులు.. రోడ్లకు మోక్షమెప్పుడో..?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 02, 2021, 02:59 PM

ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో రోడ్లకు మోక్షం కలిగేనా.. అని ప్రజలు అసహనంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో రోడ్లు చాలావరకు దెబ్బతినగా ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు మరింత దెబ్బతిన్నాయి. దీంతో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


అంతేకాకుండా ప్రమాదాల బారిన పడుతూ గాయాలపాలు అవుతున్నారు. గత రెండున్నర సంవత్సరాలుగా ఎక్కడా కూడా రోడ్లకు కనీసం మరమ్మతులు చేయలేదని ప్రతిపక్ష పార్టీలతో పాటు ప్రజలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాదు ప్రజలతోపాటు ఏకంగా విద్యార్థులు కూడా రోడ్ల కోసం రోడ్డెక్కిన పరిస్థితులు తలెత్తాయి.


మరి ప్రభుత్వం త్వరలో రోడ్ల పనులు చేపడతామని ప్రకటనలు చేస్తూనే ఉంది తప్ప ఆచరణలో ఎక్కడా అది కనపడడం లేదు. ఇప్పటికే గ్రామాలలో రోడ్లు దెబ్బతినడమే కాకుండా రాష్ట్రస్థాయి రోడ్లు కూడా భారీగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా కొమరోలు మండలం తాటిచెర్ల మోటు జంక్షన్ నుండి కొమరోలు పట్టణం సమీపంలోని ఎర్ర పల్లి గ్రామం వరకు రోడ్డు అధ్వానంగా తయారైంది.


అంతేకాకుండా పాములపల్లి, కంభం పట్టణంలోనే కాకుండా అర్ధవీడు మండలం, బేస్తవారిపేట మండలం పరిసర ప్రాంతాలలో కూడా రోడ్లు చాలావరకు దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాలలో 108 వాహనం కూడా వెళ్లలేని పరిస్థితులు తలెత్తాయి. ఇంత అధ్వానంగా రోడ్లు ఉన్నా సంబంధిత అధికారులు కానీ, ప్రజా ప్రతినిధులు కానీ ఎటువంటి చర్యలకు పూను కోవటం లేదు.


రోడ్లు మరింత దారుణంగా ఉండి ప్రమాదాల బారిన పడుతున్న ప్రదేశాలలో పోలీసులే రంగంలోకి దిగుతున్నారు. వారే దగ్గర ఉండి మరీ మరమ్మతులు చేస్తున్నారు. వారి శాఖకు సంబంధించిన పని కాకపోయినా ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని పోలీసులు రోడ్లకు మరమ్మతులు చేస్తున్నారు. మరి రానున్న రోజుల్లో ప్రభుత్వం స్పందించి రోడ్లు వేస్తుందో లేదో అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.


కానీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పంచాయతీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం తన అవసరాల కోసం లాగేసుకోవడంతో గ్రామాలలో రోడ్ల తో పాటు మౌలిక సదుపాయాల పనులు ఇక అటక ఎక్కినట్లే అని భావిస్తున్నారు ప్రజలు. మరి రానున్న రోజుల్లో ప్రభుత్వం రోడ్ల కోసం ఎలాంటి చర్యలు చేపడుతుందో లేదా ఇలానే నిర్లక్ష్యం వహిస్తుందో చూద్దాం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com