ఏపీకి మరో తుఫాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం మరింత బలపడుతోందని తెలిపింది. అల్పపీడనం రేపు వాయుగుండంగా మారనుందని, ఎల్లుండి తుఫాన్ గా మారే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర జిల్లాలకు తుఫాన్ ముప్పు పొంచి ఉందని పేర్కొంది. ఈ తుఫాన్ కు 'జవాద్' అని నామకరణం చేశారు.
తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఈనెల 4న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఈ నెల 5న ఉత్తరాంధ్ర అంతటా తీవ్ర వర్షాలు కురుస్తాయని తెలిపింది. తూర్పుగోదావరి, యానాం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకట్రెండుచోట్ల అతి నుంచి అతి భారీ వర్షాలు కురవొచ్చని పేర్కొంది. నదీపరీవాహక ప్రాంతాల్లో వరద ముప్పు ఉండొచ్చని, గురువారం ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవొచ్చని వివరించింది.