త్రిపుర సీఎం విప్లవ్ కుమార్ దేవ్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే రాష్ట్ర రాజధాని అగర్తలాలోని అన్ని కాలేజీల్లో విద్యార్థులకు హెచ్ఐవీ టెస్టులు చేయాలని ఆదేశించారు. అగర్తలాలో గత కొంత కాలంగా భారీగా ఎయిడ్స్ కేసులు నమోదవుతున్నాయని, అందులో విద్యార్థులే అధికంగా ఉంటున్నారని సీఎం అన్నారు. ఈ నేపథ్యంలో కాలేజీల్లో ప్రతి విద్యార్థికి పరీక్షలు నిర్వహించాలని, డ్రగ్స్ మూలాలను కనుక్కోవాలని చెప్పారు.
డ్రగ్స్ వినియోగం వల్ల విద్యార్థులు చెడు వ్యసనాల బాటపడుతున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. అగర్తలాలోని జీబీపీ ఆస్పత్రిలో ప్రతిరోజూ 3 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. వారిలో కాలేజీ విద్యార్థులే ఎక్కువగా ఉంటున్నారని, పరిస్థితిని అదుపుచేయడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.