వన్టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ (ఓటీఎస్) కింద ఇళ్ల లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేయాలని అధికారులపై ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి తీసుకువస్తోంది. అందరికీ లక్ష్యాలు నిర్దేశించింది. ఓటీఎస్లో ఇంటిపై హక్కు పొందకుంటే పింఛన్ నిలిపివేస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే దీనిపై ఎవరూ బహిరంగంగా మాట్లాడడం లేదు. ఓటీఎస్ను నాలుగు కేటగిరీగా విభజించిన ప్రభుత్వం తొలి దశలో ఒరిజినల్ లబ్ధిదారుల నుంచి డబ్బు వసూలు చేయాలని ఆదేశించింది.
ఇటువంటివారు జిల్లాలో లక్షన్నర మంది వుంటారని అధికారులు అంచనా వేశారు. జీవీఎంసీ పరిధిలో 50 వేలు, గ్రామీణ ప్రాంతం, రెండు మునిసిపాలిటీల పరిధిలో మరో లక్ష మంది వున్నట్టు చెబుతున్నారు. వీరి నుంచి రోజుకు రూ.2.18 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా విధించారు. అయితే రోజుకు రూ.75 లక్షల నుంచి రూ.1.2 కోట్ల వరకు వసూలవుతోంది.
మంగళవారం వరకు సుమారు రూ.తొమ్మిది కోట్లు వసూలు చేశారు. తొలివిడతలో 1.5 లక్షల మంది నుంచి మరో రూ.200 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. అంటే ఇంకా రూ.191 కోట్లు వసూలు చేయాల్సి ఉందన్నమాట. ఈ నేపథ్యంలో వలంటీర్ల నుంచి అధికారుల వరకు ప్రతి ఒక్కరూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓటీఎస్పైనే దృష్టిసారించాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఎప్పుడో ఇచ్చిన ఇళ్లపై హక్కు కోసం ఇప్పుడు డబ్బులు చెల్లించాలని ప్రభుత్వం డిమాండ్ చేయడంపై లబ్ధిదారులు మాత్రం ఆగ్రహంతో ఉన్నారు.