ప్రభుత్వ మద్యం షాపులో సూపర్వైజర్ చేతివాటం బయటపడిన ఘటన అనంతపురం జిల్లా తనకల్లులో చోటుచేసుకుంది. టైమ్స్ సమయం కథనం మేరకు.. షాపుకు సంబందించిన డబ్బులు బ్యాంకులో జమ చేసేందుకు వెళుతుంటే ఎవరో దాడి చేసి డబ్బులు ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు సూపర్ వైజర్. తీరా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంటే సంచలన విషయాలు బయటపడ్డాయి.
తనకల్లు పంచాయతీ మండ్లిపల్లికి చెందిన శ్రీనివాసులు జల్సాలకు అలవాటు పడ్డాడు. శుక్ర, శని, ఆదివారాల్లో మద్యం షాపులో వచ్చిన కలెక్షన్ రూ.3.40 లక్షలను సొంతానికి వాడుకున్నాడు. డబ్బు బ్యాంకులో జమ చేయాల్సి ఉండటంతో డ్రామాలు మొదలు పెట్టాడు. బ్యాంకులో డబ్బు కట్టేందుకు వెళుతుండగా గుర్తు తెలియని దుండగులు పల్సర్ బైకులు వచ్చి తనపై కారంపొడి చల్లి, కత్తితో దాడి చేసి డబ్బు ఎత్తుకెళ్లారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. తానే కారంపొడి శరీరంపై చల్లుకుని, బ్లేడుతో చేతిపై కోసుకొని నాటకమాడినట్లు ఒప్పుకొన్నాడు. సూపర్ వైజర్ నటనకి అందరూ అవాక్కయ్యారు. ఎస్ఈబీ అధికారులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.