ఏపీకి మరో ముప్పు పొంచి ఉందన్న వార్తలు ప్రజలను భయపెట్టాయి. మరో మూడు రోజలపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయన్న వార్తలతో జనం హడలెత్తిపోయారు. అయితే, ఇప్పుడిక భయం అక్కర్లేదు. నైరుతి బంగాళాఖాతం, దాని పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అలాగే కొనసాగుతూ తమిళనాడు, శ్రీలంక వైపుగా ప్రయాణిస్తోంది. దీంతో రాయలసీమకు ముప్పు తప్పినట్టేనని వాతావరణశాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారుతుందని తొలుత అంచనా వేసిన అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. అయితే, ఇప్పుడది ఆవర్తనంలానే ఉంటూ శ్రీలంక, తమిళనాడులోని కడలూరు, చెన్నై తీరం వైపు ఇది కదులుతోంది. ఫలితంగా అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆవర్తనం అటువైపుగా వెళ్లిపోవడంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలకు అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. అయితే, నేడు కొన్ని చోట్ల భారీ వర్షాలు మాత్రం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. 28, 29 తేదీల్లో మాత్రం గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల భారీవర్షాలకు అవకాశం ఉందని వివరించారు. కాగా, దక్షిణ అండమాన్ సముద్రంలో ఈ నెల 29న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.