పట్నా: భారీ వరదలకు అతలాకుతలమైన బిహార్ రాష్ట్రానికి ఆర్థికసాయం అందించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో శనివారం ఏరియల్ సర్వే నిర్వహించిన మోదీ.. బిహార్కు వెంటనే రూ. 500కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేగాక, వరద నష్టాన్ని అంచనా వేసేందుకు ఓ కేంద్ర బృందాన్ని రాష్ట్రానికి పంపిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఈ ఉదయం పూర్ణియా చేరుకున్న ప్రధాని మోదీ.. బిహార్ సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం సుశీల్ మోదీతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాలను విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు. అనంతరం సీనియర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఇటీవల బిహార్లో భారీ వరదలు సంభవించిన విషయం తెలిసిందే. వరదల కారణంగా అనేక గ్రామాలు నీటమునిగాయి. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఇప్పటివరకు 400 మందికి పైగా ప్రజలు వరదల్లో మృతిచెందారు. అటు ఉత్తర్ప్రదేశ్, అసోం, బంగాల్ రాష్ట్రాల్లోనూ వరదలు సంభవించి పదుల సంఖ్యలో గ్రామాలు నీటమునిగాయి.