ఓ వ్యక్తి సెల్ ఫోన్ మింగి ఆరునెలల పాటు కడుపులోనే దాచుకున్నారు. అయితే చివరికి కడుపు నొప్పి రావడంతో పరీక్షించిన వైద్యులు ఆ ఫోన్ను బయటకు తీశారు. ఈ ఘటన ఈజిప్ట్లో చోటు చేసుకుంది. దక్షిణ ఈజిప్ట్లోని ఆస్వాన్ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఆరు నెలల క్రితం పొరపాటున మొబైల్ను మింగేశాడట. అయితే, అది జీర్ణమై మలం ద్వారా బయటకొచ్చేస్తుందని భావించి వైద్యులను సంప్రదించలేదు. మొదట్లో ఇబ్బంది లేకున్నా తర్వాత అతడికి ఆహారం తీసుకోవడం కష్టమైందట. అయినా ఆహారం తక్కువ మొత్తంలో తీసుకుంటూ కాలం వెల్లదీశాడు. కాగా ఇటీవల అతడికి కడుపులో విపరీతంగా నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేరాడు. వైద్యులు పరీక్షలు నిర్వహించగా కడుపులో మొబైల్ఫోన్ను గుర్తించారు. ఆ ఫోన్ చాలాకాలం లోపలే ఉండిపోవడంతో కడుపు.. పేగుల్లో గాయాలై, ఇన్ఫెక్షన్ సోకిందని వైద్యులు తెలిపారు. వెంటనే శస్త్రచికిత్స చేసి మొబైల్ను బయటకు తీశారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని, తొందరగానే కోలుకుంటాడని వైద్యులు తెలిపారు.