ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల మధ్య రాజకీయ వైరం తారాస్థాయికి చేరింది. నిన్నటివరకు ఒకరిపై విమర్శలు, ఆరోపణలు చేసుకున్న నేతలు.. ఇప్పుడు తీవ్రవ్యాఖ్యలు చేసుకుంటూ రొడ్డెక్కారు. తమ పార్టీ కార్యాలయంపై వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడి చేశారని టీడీపీ ఆరోపిస్తుంది. వైసీపీ మాత్రం ముఖ్యమంత్రిని అవమానిస్తే బయటకు లాగి కొడతామంటూ వార్నింగ్ ఇస్తోంది. దీంతో రాష్ట్ర బంద్ కు టీడీపీ పిలుపునివ్వగా.. ఆ పార్టీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్నారు. అటు వైసీపీ నేతలు కూడా వెనక్కి తగ్గడం లేదు. చంద్రబాబు.. పట్టాభితో క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేస్తూ నిరసలకు దిగుతున్నారు. అంతేకాదు చంద్రబాబు దిష్టిబొమ్మలు, టీడీపీ జెండాలను తగలబెడుతున్నారు. దీంతో గతంలో ఎన్నడూ లేని రాజకీయ యుద్ధం ఏపీలో చోటు చేసుకుంది.ఇదే సమయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎంను ఏక వచనంతో సంబోధిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. తెలుగుదేశం పార్టీ సహనాన్ని చేతగాని తనంగా చూడవద్దన్నారు.. అంతేకాదు దమ్ముంటే నువ్వేరా తేల్చుకుందామంటూ సవాల్ విసిరారు.."ఇప్పటివరకూ ముఖ్యమంత్రి అని గౌరవించి గారూ అనేవాడిని. నీ వికృత, క్రూర బుద్ధి చూశాక సైకో, శాడిస్ట్, డ్రగ్గిస్ట్ జగన్రెడ్డి అని అంటున్నాను. నువ్వూ, నీ బినామీలు డ్రగ్స్ బిజినెస్ చేస్తారు. నిలదీసే టిడిపి నేతలపై దాడులకు పాల్పడతావా? పరిపాలించమని ప్రజలు అధికారం అందిస్తే... పోలీసుల అండతో మాఫియా సామ్రాజ్యం నడుపుతావా? టిడిపి కేంద్రకార్యాలయాలపై గూండా మూకలతో దాడులకు తెగబడతావా? ఎన్నాళ్లిలా ఇంట్లో దాక్కుని నీ కుక్కలతో దాడులు చేయిస్తావు! నువ్వే రా తేల్చుకుందాం. తెలుగుదేశం సహనం చేతకానితనం అనుకుంటున్నావా? నీ పతనానికి ఒక్కో ఇటుకా నువ్వే పేర్చుకుంటున్నావు. నిన్ను ఉరికించి కొట్టడానికి తెలుగుదేశం అధికారంలోకి రావాల్సిన అవసరంలేదు. నీ అరాచకాలపై ఆగ్రహంగా వున్న కేడర్కి మా లీడర్ కనుసైగ చేస్తే చాలు. నీ కార్యాలయాల విధ్వంసం నిమిషం పని. నీ ఫ్యాన్ రెక్కలు మడిచి విరిచి నీ పెయిడ్ ఆర్టిస్టుల్ని రాష్ట్రం దాటేంతవరకూ తరిమి కొడతారు మా కార్యకర్తలు. అన్ని ఆనవాయితీలని బ్రేక్ చేసి, ప్రజాస్వామ్యానికి పాతరేసి..నీ సమాధికి నువ్వే గొయ్యి తవ్వుకుంటున్నావు కోడికత్తిగా."ఇదిలా టీడీపీ నేతల విమర్శలపై వైసీపీ మండిపడుతోంది. ముఖ్యమంత్రిని దూషించినందుకు పట్టాభిచేత క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. విశాఖలో మంత్రి అవంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైసీపీ నేతలు ధర్నాకు దిగారు. 40ఏళ్ల అనుభవమున్న చంద్రబాబు.. ముఖ్యమంత్రిని అలా తిట్టిచండం సరికాదన్నారు. పట్టాభి కామెంట్స్ పై హోంమంత్రి సుచరిత మండిపడ్డారు. టీడీపీ నాయకులు పదే పదే బురద చల్లుతున్నారని.., టీడీపీ నాయకులు నీచమైన బాష మాట్లాడుతున్నారని ఆమె ఆరోపించారు. ఇలాంటి రాజకీయాన్ని చంద్రబాబు నాయుడు వెనకనుండి నడుపుతున్నాడని బలంగా నమ్ముతున్నామని ఆమె విమర్శించారు.