తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్పై అల్లరిమూకల దాడికి నిరసనగా ఆ పార్టీ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా ఎక్కడికక్కడ తెలుగుదేశం నేతలను పోలీసులు గృహనిర్బంధం చేస్తున్నారు. పలు చోట్ల ఇళ్ల నుంచి బయటకు వచ్చిన నేతలను అరెస్ట్ చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ తెదేపా నేతలు నిరసనలు కొనసాగిస్తున్నారు.బంద్ పిలుపు నేపథ్యంలో శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద తెదేపా నేతలు ఆందోళనకు దిగారు. ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు, మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి సహా పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. పలాస ఆర్టీసీ డిపో వద్ద తెదేపా నాయకులు ఆందోళన చేపట్టగా వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. రాజాంలో ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావు ఇంటి వద్ద పోలీసులు మోహరించి ఆయన్ను గృహనిర్బంధం చేశారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో పలువురు నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. సాలూరు వద్ద జాతీయ రహదారిపై వాహనాలను తెదేపా శ్రేణులు నిలిపేశాయి. విశాఖ జిల్లాలోనూ పలువురు తెదేపా నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్గోపాల్తో పాటు 10 మంది తెదేపా నేతలను అరెస్ట్ చేశారు. తెదేపా కార్పొరేటర్ ముక్కా శ్రావణి ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోనూ నిరసనలు కొనసాగాయి. పాడేరులో ఆందోళనకు దిగిన తెదేపా కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.