ఏపీలో టీడీపీ ఆఫీస్ లు, నేతల ఇళ్లపై దాడులకు నిరసనగా టీడీపీ బుధవారం (రేపు) రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితులపై ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. మంగళవారం రాత్రి హోంమంత్రి మీడియాతో మాట్లాడారు. టీడీపీ నేతలు హద్దులు దాటి మాట్లాడుతున్నారని, పట్టాభి వ్యాఖ్యలను విని సభ్యసమాజం హర్షించదని సుచరిత పేర్కొన్నారు. జనం మెచ్చిన నాయకుడిపై అలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ప్రజలు సహించరని సుచరిత పేర్కొన్నారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నుకున్న సీఎం పై అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యమా అంటూ సుచరిత ప్రశ్నించారు. ఏపీకి డ్రగ్స్తో సంబంధం లేదని, కేంద్రమే ఈ విషయాన్ని చెప్పిందని సుచరిత పేర్కొన్నారు. ఏపీ, ఒడిశా సరిహద్దుల్లో గంజాయి పండుతోందని, ఈ విషయం ఎప్పటినుంచో తెలిసిందేనని పేర్కొన్నారు. మంగళవారం రాష్ట్రంలో జరిగిన ఘటనలకు చంద్రబాబే బాధ్యుడని సుచరిత పేర్కొన్నారు. ఈ దాడులతో వాళ్లమీద వాళ్లే దాడి చేసుకున్నట్లుందని పేర్కొన్నారు. సీఎం జగన్ నేరాలను అరికట్టేందుకు అనేక చర్యలు చేపడుతున్నారని తెలిపారు. టీడీపీ వ్యవహారశైలీ పలు అనుమానాలకు తావిస్తోందని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హోంమంత్రి సుచరిత హెచ్చరించారు. తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదని, డ్రగ్స్ విషయంలో టీడీపీ ఆరోపణలు అవాస్తవమని పేర్కొన్నారు.