కాంగ్స్బర్గ్ : ప్రశాంతతకు మారుపేరుగా నిలిచిన నార్వేలో అలజడి చెలరేగింది. నార్వేజియన్ నగరమైన కాంగ్స్బర్గ్లో మంగళవారం-బుధవారం రాత్రి ఒక వ్యక్తి బాణాలతో దాడి చేశాడు. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసుల ప్రకారం, దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేశారు. అయితే అతడి గురించి గానీ, మరణించిన వారి గురించి గానీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఉగ్రవాద దుశ్చర్యనా? లేక శుత్రుత్వంతో చేసిందా? అనేది ఇంకా తెలియరాలేదు.
కాంగ్స్బర్గ్లోని కూపే ఎక్స్ట్రా సూపర్మార్కెట్లోకి ప్రవేశించిన ఒక వ్యక్తి అక్కడున్న వారిపై బాణంతో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో అక్కడ ఉన్న ఐదుగురు చనిపోయారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, ఇప్పడు ఇంతకన్నా ఎక్కువ ఏమీ చెప్పలేమని కాంగ్స్బర్గ్ పోలీస్ చీఫ్ ఒవిండ్ ఆస్ అన్నారు. ఒవిండ్ ఆస్ ప్రకారం, దాడి చేసిన వ్యక్తి మొదట నగరంలోని రద్దీ కూడలిలో ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకున్నాడు. అనంతరం ఇటు వైపు పరుగెత్తాడు. పోలీసులు అతడిని వెంబడించి పట్టుకున్నారు. కాగా, ఘటనా స్థలానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న డ్రెమెన్ ప్రాంతం నుంచి దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ సమయంలో అతను పోలీసులపై దాడికి కూడా ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి.