బెంగళూరు:ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలి ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే నేత శశికళకు మరో షాకింగ్ న్యూస్. కోర్టు విధించిన పది కోట్ల రూపాయల జరిమానాను ఆమె చెల్లించకుంటే శిక్ష ముగిసినా అదనంగా మరో 13 నెలలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ‘‘కోర్టు ఆదేశాల ప్రకారం శశికళ రూ.10 కోట్లు చెల్లించాల్సి ఉంది. జరిమానా సొమ్ము చెల్లించడంలో ఆమె విఫలమైతే అదనంగా మరో 13 నెలలపాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది’’ అని జైలు సూపరింటెండెంట్ కృష్ణ కుమార్ తెలిపారు.
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం శశికళ నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంది. అయితే 2014లో ట్రయల్ కోర్టు ఆమెకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించడంతో ప్రస్తుతం ఉన్న జైల్లోనే అప్పట్లో ఆమె 21 రోజుల జైలు శిక్ష అనుభవించారు. దీంతో ఆమె ఇంకా మూడు సంవత్సరాల 11 నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంది. శశికళ, ఇళవరసి, సుధాకరన్లను సాధారణ ఖైదీలుగానే పరిగణిస్తామని, వాళ్లని ప్రత్యేకంగా ఏమీ చూడబోమని, జైల్లోని ఇతర ఖైదీలకు అందే సౌకర్యాలే వారికీ అందుతాయని కుమార్ పేర్కొన్నారు. జైలులో తయారుచేసిన ఆహారాన్నే వారు తీసుకుంటున్నారని, వైద్యులు క్రమం తప్పకుండా పరీక్షలు చేస్తున్నారని ఆయన తెలిపారు. అందరితో కలిసే వారు టీవీ వీక్షిస్తున్నట్టు కుమార్ వివరించారు.