న్యూఢిల్లీ: ఇండియా యుద్ధానికి సిద్ధమవుతున్నదా? ఇండియన్ ఆర్మీ తీసుకుంటున్న చర్యలు ఆ దిశగా సంకేతాన్నిస్తున్నాయి. ఇండియా, చైనా, భూటాన్ ట్రైజంక్షన్ దగ్గర ఉన్న వివాదాస్పద ప్రాంతం డోక్లామ్ దగ్గర ఉన్న గ్రామాన్ని ఖాళీ చేయాల్సిందిగా ఆర్మీ ఆదేశించింది. నాతంగ్ అనే ఈ గ్రామంలో కొన్ని వందల మంది నివసిస్తున్నారు. వీళ్లంతా వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆర్మీ స్పష్టంచేసింది. డోక్లామ్కు ఈ గ్రామం 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒకవేళ యుద్ధం జరిగితే పౌరులు గాయపడకుండా ముందు జాగ్రత్తగా గ్రామాన్ని ఖాళీ చేయిస్తున్నారా లేదా సుక్నా నుంచి డోక్లామ్ వైపు వెళ్తున్న 33 కార్ప్కు చెందిన వేల మంది సైనికులకు ఇక్కడ బస ఏర్పాటు చేస్తారా అన్నది స్పష్టంగా తెలియలేదు. ఈ ప్రాంతంలో భారీగా బలగాలు వస్తున్నాయని గ్రామస్థులు వెల్లడించారు. అయితే ప్రతి ఏడాది సెప్టెంబర్లో ఇలా బలగాల తరలింపు జరగడం సాధారణమేనని, ఈసారి మాత్రం కాస్త ముందుగానే తరలిస్తున్నట్లు సీనియర్ మిలిటరీ అధికారులు చెప్పారు. అయితే మిలిటరీ మాత్రం నో వార్ (యుద్ధం), నో పీస్ (శాంతి) అన్న మూడ్లో ఉన్నారని వాళ్లు తెలిపారు. గత కొన్ని రోజులుగా చైనీస్ మీడియా యుద్ధానికీ సిద్ధమంటూ ఊదరగొడుతున్న నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ కూడా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నది. రెండు దేశాల బలగాలు యుద్ధానికి సిద్ధమవుతున్నాయి అని చైనా పత్రిక గ్లోబల్ టైమ్స్ తమ ఎడిటోరియల్లో రాసింది.