ఐపీఎల్ 2021 సీజన్ రెండో భాగం UAE లో ప్రారంభమైంది. అన్ని జట్ల సన్నాహాలు దాదాపుగా పూర్తయ్యాయి. చాలా మంది జట్లకు చెందిన విదేశీ ఆటగాళ్లు ఈ మ్యాచ్లకు దూరంగా ఉన్నారు. వారి స్థానంలో కొత్త ఆటగాళ్లు చేరిపోయారు. కానీ యఏఈకి చేరే ముందు ఒక ఆటగాడు చక్కటి ప్రదర్శన కనబరిచాడు. అతడి పేరు జార్జ్ గార్టన్. ఈ ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతున్నాడు. గార్టెన్ ప్రస్తుతం ఇంగ్లాండ్లో ఉన్నాడు త్వరలో RCB లో చేరతాడు. కానీ అతడి సామర్థ్యం గురించి ఒక్కసారి తెలుసుకోవాల్సిందే.
సెప్టెంబర్ 18 శనివారం ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లో జరిగిన టీ 20 బ్లాస్ట్ టోర్నమెంట్లో గార్టెన్ తన జట్టు సస్సెక్స్ కోసం అద్భుత ప్రదర్శన కనబరిచాడు. టోర్నమెంట్ రెండో సెమీ ఫైనల్లో సస్సెక్స్ టీం.. కెంట్ జట్టుతో తలపడింది. మొదట బ్యాటింగ్ చేసిన కెంట్ 20 ఓవర్లలో 168 పరుగులు చేసింది. డానియల్ బాలే 81 పరుగులు చేశాడు. ప్రతిస్పందనగా సస్సెక్స్ మొత్తం జట్టు 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. 21 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే తన టీం ఓడిపోయినా గార్టెన్ ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. ఈ 24 ఏళ్ల యువ ఫాస్ట్ బౌలర్ అత్యంత వేగంగా బౌలింగ్ చేయగలడు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ గార్టెన్ సస్సెక్స్ కోసం 4 ఓవర్లు వేసి కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చాడు అంతేకాదు రెండు కీలక వికెట్లు సాధించాడు.
అదే సమయంలో సస్సెక్స్ 57 పరుగులకే 5 వికెట్లు పోయి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన గార్టెన్ తన బ్యాట్ శక్తిని చూపించాడు. కెంట్ బౌలర్లను చితకబాదాడు. కేవలం 23 బంతుల్లో 41 పరుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్లు 3 సిక్సర్లు ఉండటం విశేషం. సస్సెక్స్ ఓడిపోయి ఉండవచ్చు కానీ గార్టెన్ ప్రదర్శన విరాట్ కోహ్లీతో సహా RCB టీమ్ మేనేజ్మెంట్ని ఆశ్చర్యపరిచింది. ఎడమ చేతి ఆస్ట్రేలియన్ మీడియం పేసర్ డేనియల్ సామ్స్ ఉపసంహరణ తర్వాత RCB గార్టెన్ వైపు మొగ్గుచూపింది. గార్టెన్ తన కెరీర్లో ఇప్పటివరకు 39 టీ 20 మ్యాచ్లు ఆడాడు అందులో 46 వికెట్లు తీశాడు. బ్యాట్తో పాటు అతను 131 స్ట్రైక్ రేట్ వద్ద 228 పరుగులు కూడా చేశాడు.