ముంబై: ఇండియా ఆర్థిక రాజధాని ముంబై కాషాయమయమైంది. సుమారు పది లక్షల మంది మరాఠాలు రోడ్లపై భారీ ర్యాలీ నిర్వహించారు. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, రైతు రుణాల మాఫీ, ఎస్సీ, ఎస్టీ చట్టానికి సవరణలు.. ఇలా పెద్ద డిమాండ్ల చిట్టాతో వాళ్లు ఈ నిరసన తెలిపారు. 24 గంటలుగా ముంబైలో స్కూళ్లు మూతపడ్డాయి. ట్రాఫిక్ అస్తవ్యస్తమైంది. అదనపు బలగాలను మోహరించారు. కేవలం ఐదు కిలోమీటర్ల మేరే ఈ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించినా.. భారీగా నిరసనకారులు తరలిరావడంతో ముంబై వాసులకు ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. వీళ్లలో అగ్రవర్ణ కులాలకు చెందినవాళ్లే ఎక్కువ. మహారాష్ట్రలో చాలా వరకు రాజకీయ నేతలు ఈ సమాజిక వర్గానికి చెందినవాళ్లే అయినా.. వాళ్లు తమకు చేసిందేమీ లేదని వీళ్లలో అసంతృప్తి పెరిగిపోయింది. దళితులు, ఇతర వెనుకబడిన కులాల వారు రిజర్వేషన్లు ఉపయోగించుకొని ముందుకు వెళ్తుండగా.. తాము మాత్రం వెనుకబడి పోతున్నామన్న ఆక్రోశం వీళ్లలో కనిపిస్తున్నది. ఇవాళ ముంబైలోని బైకుల్లా ప్రాంతంలో ఉదయం 11 గంటలకు ఈ నిరసన ర్యాలీ ప్రారంభమైంది. ఆజాద్ మైదాన్లో ర్యాలీ ముగిసిన తర్వాత.. ఓ ప్రతినిధి బృందం సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ను కలవనున్నారు.