ఆర్బీఐ కొత్తగా ప్రవేశపెట్టిన రూ.500 నోట్లపై రాజ్యసభలో దుమారం చెలరేగింది. 500 నోట్లు శతాబ్దంలో పెద్ద స్కామ్ అని కాంగ్రెస్ ఆరోపించింది. వేర్వేరు సైజులు, డిజైన్లు ఉన్న రెండు నోట్లను కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ సభలో చూపించారు. తాము కూడా దేశాన్ని పాలించాంగానీ ఇలా ఒకటి ప్రభుత్వం కోసం, ఒకటి పార్టీ కోసం రెండు రకాలు నోట్లను ఎప్పుడూ ముద్రించలేదన్నారు. 500, 2000 నోట్లు రెండు రకాలుగా ఉన్నాయని గులామ్ నబీ ఆజాద్ ఆరోపించారు. అయితే జీరో హవర్లో ఎన్నో ముఖ్యమైన అంశాలపై చర్చించాల్సి ఉన్నా.. కాంగ్రెస్ మాత్రం కరెన్సీ నోట్లపై బాధ్యతారాహిత్య ప్రకటన చేస్తున్నదని ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ విమర్శించారు. దీంతో కాంగ్రెస్ నేతలంతా సభలో ఆందోళన చేశారు. రెండు వేర్వేరు సైజులు, డిజైన్లలో ఆర్బీఐ నోట్లను ముద్రిస్తున్నదని సిబల్ విమర్శించారు. తృణమూల్ కాంగ్రెస్ నేత డెరెక్ ఓబ్రైన్ కూడా కాంగ్రెస్ లేవనెత్తిన అంశాన్ని సమర్థించారు. ఇది చాలా సీరియస్ అంశమని ఓబ్రైన్ అన్నారు. అయితే ఈ నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వి నిలదీశారు.