అన్నదాతలకు కేంద్రప్రభుత్వం గుడ్న్యూస్ ప్రకటించింది. రబీ పంటలకు కనీసం మద్దతును పెంచుతూ.. కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ బుధవారం ఆమోదం తెలిపింది. రబీ సీజన్ లో పంటలు వేసే రైతులందరికీ ఈ నిర్ణయం వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. వేర్వేరు పంటలకు కనీసం రూ. 40 నుంచి రూ.400 వరకు కనీస మద్దతు ధర పెంచినట్లు కేంద్రం తెలిపింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి ఇవాళ సమావేశమైంది. ఈ సందర్భంగా దేశంలో 2022-23 మార్కెటింగ్ సీజన్లో అధీకృత రబీ పంటలన్నిటికీ కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ను పెంచే ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. ఆయా పంటలు సాగుచేసిన రైతులకు దిగుబడిపై గిట్టుబాటు ధర లభ్యతపై భరోసా ఇస్తూ 2022-23 మార్కెటింగ్ సీజన్కుగాను ప్రభుత్వం రబీ పంటల కనీస మద్దతు ధరను పెంచింది. ఈ మేరకు నిరుటితో పోలిస్తే అత్యధికంగా పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
ముఖ్యంగా గోధుమలు, బార్లీ, శనగలు, చెరకు, ఆవాలు లపై కనీస మద్దతు ధరలు పెంచిన కేంద్రం.. 2022 – 23 మార్కెటింగ్ సీజన్కు ఈ కొత్త కనీస మద్దతు ధరలు వర్తింపచేయనుంది. గత సంవత్సరం కంటే MSP లో అత్యధిక పెరుగుదల కాయధాన్యాలు (మసూర్) , రేప్సీడ్లు, ఆవాలు పంటకు ప్రతి క్వింటాల్కు రూ. 400 చొప్పున మద్దుతు ధర లభించనుంది. ఇక, క్వింటాల్ చెరకు మద్దతు ధర రూ. 290 ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే, గోధుమలపై రూ.40, బార్లీ రూ.35 , శనగలపై రూ.350 మద్దతు ధర పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఇక, పెరిగిన ధరలతో క్వింటాల్ గోధుమలకు రూ. 2015 మద్దతు ధర లభించనుంది. ఇక పెంచిన ధరలతో దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు కాస్త ఊరట లభించనుంది.