ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు చంద్రబాబు లేఖ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 08, 2021, 11:15 AM

ఏపీ రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ప్రకాశం జిల్లా లింగసముద్రం పోలీసులు వైసీపీ నేతల ఆదేశాలతో మొగిలిచర్లకు చెందిన టీడీపీ కార్యకర్తలను స్టేషన్‌కు పిలిపించి వేధిస్తున్నారని తెలిపారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో 6, 10 ఏళ్ల చిన్నారులు కూడా ఉన్నారన్నారు. కార్యకర్తలు రత్తయ్య, శ్రీకాంత్‌లను పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని ఆయన చెప్పారు. టీడీపీని వీడాలని హింసించి అర్థరాత్రి 2గంటలకు వదిలిపెట్టారని... మళ్లీ ఉదయాన్నే ఎస్ఐ ఫోన్‌ చేసిన స్టేషన్‌కు రావాలని బెదిరించారని లేఖలో వెల్లడించారు. పోలీసుల వేధింపులు తాళలేక రత్తయ్య, శ్రీకాంత్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. స్టేషన్‌కు పిలిపించిన వారికి ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వలేదని అన్నారు. ఈ ఘటనతో పోలీసుల వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతోందని బాబు పేర్కొన్నారు.


రాష్ట్రంలో కొందరు పోలీసులు వైసీపీ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని విమర్శించారు. రెండేళ్లలో పోలీసుల వేధింపులు తారాస్థాయికి చేరాయన్నారు. పోలీసులపై ప్రజలు పెట్టుకున్న విశ్వాసం అగాధంలోకి వెళ్లిందని తెలిపారు. రాష్ట్రంలో పోలీస్ ప్రతిష్ఠ రోజురోజుకూ దిగజారుతోందన్నారు. చట్టానికి లోబడి పోలీసులు విధులు నిర్వహించాలని సూచించారు. లింగసముద్రం ఘటనపై తక్షణమే విచరణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పక్షపాతం లేకుండా పోలీసులు విధులు నిర్వహించేలా ఆదేశించాలని చంద్రబాబు నాయుడు లేఖలో పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com