రోడ్లను బాగుచేయడంపై దృష్టిపెట్టండని ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. మళ్లీ వర్షాకాలం వచ్చేలోగా రాష్ట్రంలో రోడ్లన్నింటినీ బాగుచేయాలని ఆయన ఆదేశించారు. “అక్టోబరు మాసానికల్లా వర్షాలు తగ్గుముఖం పడతాయి. తర్వాత పనుల కాలం మొదలవుతుంది.” అని సీఎం అన్నారు. “మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లపై ప్రత్యేక దృష్టిపెట్టాం. గత ప్రభుత్వంలో రోడ్లను పూర్తిగా విడిచిపెట్టారు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏడాదీ వర్షాలు మంచిగా పడ్డాయి. దేవుడి దయవల్ల వర్షాలు బాగా పడ్డం వల్ల రైతులు సంతోషంగా ఉన్నారు. వర్షాలు పడ్డం వల్ల మరోవైపు రోడ్లు కూడా దెబ్బతిన్నాయి. రోడ్లను బాగుచేయడనికి ఈ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది” అని సీఎం అమరావతిలో నిర్వహించిన రహదారులు, ఓడరేవులు, విమానాశ్రయాల సమీక్షా సమావేశంలో తెలిపారు.