ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మతాల మధ్య సోము వీర్రాజు చిచ్చు: వెల్లంపల్లి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 06, 2021, 02:01 PM

విజయవాడ: బీజేపీ నేతలు మత రాజకీయాలు మానుకోవాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ హితవు పలికారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సోము వీర్రాజు మతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం ఆదేశాలతో వినాయక చవితి వేడుకలపై నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. సోము వీర్రాజు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని దుయ్యబట్టారు.


ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కులమతాలకతీతంగా పాలన చేస్తున్నారన్నారని మంత్రి అన్నారు. బీజేపీ నేతలకు హిందూమతంపై గౌరవం ఉంటే గతంలోనే ప్రశ్నించేవారని, ఆలయాలను కూల్చిన టీడీపీని బీజేపీ ఏనాడూ ప్రశ్నించలేదని మంత్రి వెల్లంపల్లి ధ్వజమెత్తారు.


 


''వినాయక చవితి చేసుకోవద్దని మేం చెప్పలేదు. దీనిపై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మతం ముసుగులో రాజకీయాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వంపై మతం పేరుతో బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. కుల,మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. కేంద్రం ఇచ్చిన గైడ్‌ లైన్స్‌ మేరకే గణేశ్‌ ఉత్సవాలపై నిర్ణయం తీసుకున్నాం. కేంద్ర ప్రభుత్వమే కోవిడ్‌ గైడ్‌లైన్స్‌ ఇచ్చింది.


 


గైడ్‌లైన్స్‌ మార్చమని కేంద్రాన్ని అడగండి. కుల,మతాల రాజకీయాలు చేసే ప్రభుత్వం మాది కాదు. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పండుగ చేసుకోమని చెప్పాం. దయ చేసి ప్రజలను రెచ్చగొట్టొదు. వినాయక చవితి అందరి పండుగ పెద్ద విగ్రహాలు, ఊరేగింపులు పెట్టకూడదని మాత్రమే సూచించాం. మత విద్వేషాలతో లబ్ధి పొందాలని చూడొద్దని'' మంత్రి హితవు పలికారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com