చిత్తూరు: ఆత్మహత్యాయత్నం చేసిన ఓ వృద్ధురాలిని రేణిగుంట రైల్వే పోలీసులు రక్షించారు. సీఐ రామకృష్ణ కథనం మేరకు రేణిగుంట పంచాయతీ బాలాజీనగర్కు చెందిన పాండియమ్మ(73) జీవితంపై విరక్తి చెంది స్థానిక రైల్వేస్టేషన్ చేరుకుంది. అనంతరం ఐదవ నెంబరు ప్లాట్ ఫాం సమీపంలో ఆగిన గూడ్సు రైలు కింద తలపెట్టి ఆత్మహత్యకు ప్రయత్నించింది. అక్కడే విధుల్లో ఉన్న రైల్వే ఎస్ఐ అనిల్, హెడ్ కానిస్టేబుల్ గౌరీశంకర్ గుర్తించి పరుగున వెళ్లి వృద్ధురాలిని రక్షించారు. ఆ వెంటనే గూడ్సు రైలు కదలడంతో తృటిలో ప్రాణాపాయం నుంచి ఆమె తప్పించుకున్నట్ల్టయింది. కాగా, తనను ఆదరించే వారు ఎవరూ లేకపోవడంతో చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు పాండియమ్మ పోలీసులకు వివరించింది.