సెకండ్ వేవ్ సమయంలో లక్షల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. అయితే ప్రస్తుతం పరిస్థితులు కాస్త సద్దుమణిగినట్లు కనిపిస్తున్నాయి. కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది. అయితే తగ్గుతోన్న కేసుల సంఖ్య చూసి సంతోషపడే పరిస్థితులు లేవని కేంద్రం హెచ్చరిస్తోంది. రానున్న రోజుల్లో వినాయక చవితి, దసరా ఇలా పండుగల సీజన్ మొదలు కానుంది. దీంతో ఇప్పటికే మార్కెట్లలో సందడి షురూ అయ్యింది. ప్రజా రవాణా వ్యవస్థ మళ్లీ గాడినపడుతోంది. బస్సులు, రైళ్లలో ప్రయాణీకుల రద్దీ మొదలయ్యింది. సెప్టెంబర్-అక్టోబర్లో గణేశ చతుర్ధి, దసరా ఉత్సవాలతో జనం గుమిగూడే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలను అలెర్ట్ చేసింది. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోన్నా ఇప్పటికే కొన్ని కొన్ని జిల్లాల్లో అత్యధిక పాజిటివిటీ రేటు ఉండటం ఆందోళన కలిగిస్తోందని కేంద్రం అభిప్రాయపడింది. హై-పాజిటివిటీ రేటు ఉన్న చోట వైరస్ వ్యాప్తిని కట్టడి చేయాలని సూచించింది. కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాల ప్రకారం చర్యలు చేపట్టాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.