ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్పై తాము కోర్టుకి లిఖితపూర్వక వాదనలు సమర్పించామని పిటిషనర్ తరపు న్యాయవాది శ్రీవెంకటేష్ తెలిపారు. సీబీఐ గత విచారణలో లిఖిత పూర్వక వాదనలు సమర్పిస్తామనిని చెప్పారని.. కానీ మరోసారి గడువు కావాలని, ఢిల్లీ నుంచి తమకు పై అధికారులు నుండి ఆదేశాలు రాలేదని కోరారన్నారు. దీంతో తాము అవకాశం ఇవ్వకూడదని గట్టిగా కోర్టు దృష్టికి తీసుకొచ్చినట్లు చెప్పారు. దీంతో జూన్ 1న వేసిన మెమోను రికార్డులోకి తీసుకోవాలని సీబీఐ కోర్టుకి చెప్పిందన్నారు. గత విచారణలో సీబీఐ స్వయంగా లిఖితపూర్వక వాదనలు సమర్పిస్తామని చెప్పి, ఇప్పుడు గడువు ఇవ్వక పోయేసరికి గతంలో వేసిన మెమోనే లెక్కలోకి తీసుకోవాని చెప్పారని లాయర్ తెలిపారు. దీంతో ఆగస్టు 25న ఆర్డర్ పాస్ చేస్తున్నట్లు కోర్టు తెలిపిందన్నారు.
2017లో సీబీఐ స్వయంగా జగన్ బెయిల్ రద్దు చేయాలని, సాక్షులను ప్రభావితం చేస్తున్నారని కోర్టును కోరారని... కానీ ఇప్పుడు సీబీఐ తటస్థంగా ఉండడం సరైంది కాదని ఆయన అన్నారు. సీబీఐ తటస్థంగా ఉండడంతో తాము చేసిన వాదనలకు బలం చేకూర్చినట్లు భావించాలన్నారు. తమ వాదనలలో నిజం లేకపోతే సీబీఐ కచ్చితంగా వ్యతిరేకించేదని... కాబట్టి ఆగస్టు 25న బెయిల్ రద్దు పిటిషన్పై సీబీఐ కోర్టు కీలక నిర్ణయం తీసుకోనుందని పిటిషనర్ తరపు న్యాయవాది శ్రీవెంకటేష్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆగస్టు 25న సీబీఐ కోర్టు తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.