గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మహారాష్ట్రలో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 136 మంది మృతిచెందారని సహాయ, పునరావాస శాఖ మంత్రి విజయ్ వాడెట్టి తెలిపారు. ఇందులో రాయ్గఢ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో మరణించిన 36 మంది కూడా ఉన్నారని చెప్పారు. కొంకన్ రీజియన్లోని పలు జిల్లాల్లో ఇప్పటివరకు సుమారు 84 వేల మందిని పునరావాస, సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు. ఇందులో కొల్హాపూర్కు చెందినవారే 40 వేల మందికి పైగా ఉన్నారని.. జిల్లాలో సుమారు 54 గ్రామాలు పూర్తిగా వరదల్లో మునిగిపోయాయన్నారు.
భారీ వర్షాల కారణంగా జిల్లాలోని పంచ్గంగా నది ఉధృతంగా ప్రవహిస్తోందని, 2019 తర్వాత ఇంతగా వరదలు సంభవించడం ఇదే మొదటిసారని చెప్పారు. రాయ్గఢ్ జిల్లాలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో 33 మంది మృతదేహాలను వెలికితీశామని, మరో 52 మంది గల్లంతయ్యారని మంత్రి ఏక్నాథ్ షిండే తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ ఘటనలో మొత్తం 32 నివాసాలు దెబ్బతిన్నాయని వెల్లడించారు.