ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అతి విశ్వాసమే బిజెపిని ఓడించింది: సువేందు అధికారి

national |  Suryaa Desk  | Published : Mon, Jul 19, 2021, 01:58 PM

కోల్‌కతా : ఇటీవల బిజెపిలో చేరిన సువేందు అధికారి సొంత పార్టీ నేతలపైనే తీవ్ర విమర్శలు చేశారు. తమ నేతల అతి నమ్మకంతోనే బిజెపి అపజయం పాలైందని ఆయన అన్నారు. పార్టీ 170 సీట్లు సాధించి తీరుతుందంటూ పలువురు నేతలు అతిగా విశ్వసించారని .. అదే బిజెపి ఓటమికి కారణమైందని మండిపడ్డారు. పూరబ్‌ మిడ్నాపూర్‌ జిల్లాలోని చండీపూర్‌ ప్రాంతంలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గర్వం, అతి నమ్మకంతోనే రాష్ట్రంలోని పరిస్థితులపై అవగాహన ఏర్పరుచుకోలేకపోయారని అన్నారు. మొదటి, రెండో దశ ఎన్నికల సమయాల్లో తాము విజయం సాధించేందుకు తీవ్రంగా కృషి చేశామని.. దీంతో పలువురు నేతలకు అతి నమ్మకం ఎక్కువైందని అన్నారు. ఎన్నికల్లో బిజెపి 180 లేదా 170 సీట్లను సాధించి తీరుతుందని విశ్వసించారని.. అయితే బాధ్యతలను విస్మరించారని అన్నారు. దీనికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని సువేందు అన్నారు. భారీ లక్ష్యాలను సాధించేందుకు సాధారణ స్థాయి నుండి తీవ్రంగా కృషి చేయాల్సి వుంటుందని.. అది విస్మరించారని మండి పడ్డారు. అసెంబ్లీ ఎన్నికలకు మందు సువేందు అధికారి తృణమూల్‌ కాంగ్రెస్‌ (టిఎంసి) నుండి బిజెపిలో చేరిన సంగతి తెలిసిందే. సువేందు వ్యాఖ్యలపై టిఎంసి అధికార ప్రతినిధి కునాల్‌ ఘోష్‌ ఘాటుగా స్పందించారు. బిజెపి నేతలు వాస్తవాలకు విరుద్ధంగా తప్పుడు విశ్వాసాలతో ఊహల్లోనే విహరిస్తుంటారని అన్నారు. ఇతరుల్లోని లోపాలను ఎందుకు ఎంచుతున్నారని .. ఆయన కూడా 180 సీట్లు సాధిస్తామంటూ పలుసార్లు ప్రగల్భాలు పలికారని ఎద్దేవా చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com