ఇస్లామాబాద్: పాకిస్థాన్ తాత్కాలిక (ఆపద్ధర్మ) ప్రధానమంత్రిగా పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్)నేత షాహిద్ ఖాకన్ అబ్బాసీ ఎన్నికయ్యారు. షాహిద్ అబ్బాసీ నవాజ్ షరీఫ్ కేబినెట్లో పెట్రోలియం శాఖ మంత్రిగా పనిచేశారు. పాక్ తాత్కాలిక ప్రధాని పదవి కోసం ఆరుగురు పోటీ పడగా.. షాహిద్ అబ్బాసీ విజయం సాధించారు. 45 రోజుల పాటు పాక్ తాత్కాలిక ప్రధానిగా షాహిద్అబ్బాసీ పని చేయనున్నట్లు సమాచారం. పనామా పత్రాల అవినీతి కేసు వల్ల పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పై ఆ దేశ సుప్రీంకోర్టు అనర్హత వేటు వేస్తూ సంచలన తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే.పాక్ తాత్కాలిక ప్రధాని పదవి కోసం అధికార పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ పార్టీ నుంచి షాహిద్ ఖాకన్ అబ్బాసీ నామినేషన్ సమర్పించగా..ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ నుంచి షేక్ రషీద్, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ తరఫున ఇద్దరు నేతలు ఖుర్షీద్షా, నవీద్ కమర్, ముత్తాహిదా ఖ్వామీ మూవ్మెంట్ తరఫున కిశ్వర్ జెహ్రా, జమాతే ఇస్లామీ తరఫున తారిఖుల్లా నామినేషన్ వేసిన విషయం తెలిసిందే.