ఉత్తరాఖండ్ సీఎం తీరథ్ సింగ్ రావత్ రాజీనామా చేశారు. సీఎంగా ప్రమాణం చేసిన నాలుగో నెలకే ఆయన తన పదవి నుండి దిగిపోయారు. గత మార్చిలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రావత్.. ప్రస్తుతం లోక్ సభ సభ్యులు. సెప్టెంబర్ లోగా ఆయన శాసనసభ్యుడిగా ఎన్నిక కావాల్సి ఉంది. ఉత్తారాఖండ్ అసెంబ్లీలోకి వచ్చే ఏడాది ఆరంభంలో ఎన్నికలు జరగాల్సి ఉంది. అసెంబ్లీకి ఏడాదిలో ఎన్నికలు ఉంటే.. ఉప ఎన్నిక నిర్వహించరాదనే నిబంధనతో పాటు, కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఖాళీగా ఉన్న స్థానాలకు అక్కడ ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం లేదు. దీంతో ఆయన తప్పుకోవడమే సరైన నిర్ణయమని భావించి ఈ మేరకు గవర్నర్కు రాజీనామా లేఖను సమర్పించారు. కాగా నేడు మధ్యాహ్నం 3 గంటలకు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మదన్ కౌశిక్ నేతృత్వంలో శాసనసభాపక్ష భేటీ జరగనుంది. ఈ సమావేశంలో తమ తదుపరి శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు.