భార్య ఉరివేసుకుని చనిపోయిందని.. వెంటనే భర్త కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన పుణేలో జరిగింది. గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. నిఖిల్ శేండ్కర్ (27), ఆయన భార్య అంకిత శేండ్కర్ (26) పుణేలో వానవడీలోని ఆజాద్ నగర్ లో నివసిస్తున్నారు. వారు వృత్తిరీత్యా వైద్యులు. బుధవారం రాత్రి నిఖిల్ ఇంటికి తిరిగి వచ్చే సమయంలో భార్యతో ఫోన్ లో చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో అంకిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విధులు ముగించుకుని రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చిన నిఖిల్ కు భార్య ఉరివేసుకుని కనిపించింది. భార్య మరణాన్ని తట్టుకోలేక అతను కూడా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఆ వైద్య దంపతుల జీవితం విషాదంగా ముగిసింది.