ముంబయి: ‘‘మా దేశంలో మీ జట్టు పర్యటనను వెంటనే ఖరారు చేయండి. లేకుంటే మా ఆటగాళ్లను మీ ఐపీఎల్లో ఆడనివ్వం’’ అంటూ రెండు నెలల కిందట క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్ఏ).. బీసీసీఐకి హెచ్చరికలు జారీ చేయడం గుర్తుండే ఉంటుంది. ఐతే అప్పుడేమీ బదులివ్వకుండా వూరుకున్న బీసీసీఐ.. ఇప్పుడు సఫారీలకు పెద్ద షాకే ఇచ్చేలా ఉంది. ఈ ఏడాది చివర్లో మొదలవ్వాల్సిన భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనపై సందేహాలు రేకెత్తించే నిర్ణయం తీసుకునేలా ఉంది భారత బోర్డు. ప్రస్తుతం భారత జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.
దీనికి బదులుగా శ్రీలంక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భారత్కు రావాల్సి ఉండగా.. ఈ ఏడాది నవంబరు-డిసెంబరు నెలల్లోనే ఈ సిరీస్కు సన్నాహాలు చేస్తోంది బీసీసీఐ. ఈ పర్యటనలో భారత్తో మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఓ టీ20 ఆడనుంది లంక. పాలనా పరమైన సంక్షోభం, అంతర్గత సమస్యల కారణంగా మునుపటితో పోలిస్తే బీసీసీఐలో దూకుడు తగ్గిన నేపథ్యంలో క్రికెట్ దక్షిణాఫ్రికా సహా కొన్ని బోర్డు తమను తేలిగ్గా తీసుకుంటుండటం గమనించే బోర్డు వైఖరి మార్చుకున్నట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికాలో భారత జట్టు పర్యటనను సందిగ్ధతలోకి నెట్టడం ద్వారా ఆ దేశ బోర్డును కట్టడి చేయాలని బోర్డు భావిస్తున్నట్లుగా సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎస్ఏ ఎలా స్పందిస్తుందో చూడాలి.