పీటల మీద పెళ్లి ఆపేసి వరుడికి వధువు షాక్ ఇచ్చింది. మరి కొద్ది సేపట్లో మాంగళ్యదారణ జరిగిపోతుందనుకున్న సమయంలో ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. దీంతో అక్కడ ఉన్నవారంతా షాక్ తిన్నారు. ఉత్తర్ప్రదేశ్కు చెందిన ఓ యువతికి మహోబా జిల్లాలోని ధవార్ గ్రామానికి చెందిన ఓ యువకుడితో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. శనివారం పెళ్లి మండపానికి అందరూ చేరుకున్నారు. పురోహితుడు పెళ్లి తంతు మొదలు పెట్టాడు. తాను చెబుతున్నట్లు మంత్రాలు తిరిగి అప్పజెప్పాలని వరుడికి పురోహితుడు సూచించాడు. అయితే తిరిగి అప్పజెప్పడంలో వరుడు తడబడ్డాడు. ఒక్క మంత్రమూ సరిగా పలకలేక పోతున్నాడు. దీంతో అనుమానం కలిగిన ఆ వధువు వెంటనే రెండో ఎక్కం చెప్పమని పెళ్లికొడుకుని అడిగింది. అంతే తెల్లమొహం వేసుకున్నాడు. దీంతో ఈ పెళ్లి తాను చేసుకోనంటే చేసుకోనని మండపం దిగిపోయింది. బంధువులు ఎంత నచ్చజెప్పినా ఆ పెళ్లి కూతురు ఒప్పుకోలేదు. చివరకు తమ కూతురు నిర్ణయమై సరైనదని వధువు తల్లిదండ్రులు కూడా పెళ్లి రద్దు చేసుకున్నారు.