దేశంలో కరోనా సునామీలో విరుచుకుపడుతోంది. రోజుకు మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతుండగా.. మే ప్రథమార్ధంలో మహమ్మారి తీవ్రత గరిష్ఠానికి చేరుకుంటుందని పలు నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పరిస్థితిని అదుపు చేయడానికి దేశవ్యాప్తంగా ఆరోగ్య అత్యయిక స్థితిని విధించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటిస్తే కరోనా కట్టడి చర్యలపై ఎటువంటి నిర్ణయమైనా తీసుకునే అధికారం కేంద్రం పరిధిలోకి వెళుతుంది. అయితే, ఈ విషయంలో ఎలాంటి నిర్ణయమైనా మే 2 తరువాత ఉంటుందని సమాచారం. పశ్చిమ బెంగాల్లో మరో విడత పోలింగ్ మిగిలి ఉండగా, మే 2 ఫలితాలు వెలువడనున్న విషయం తెలిసిందే. ఈ ప్రక్రియ ముగిసిన తరువాతే హెల్త్ ఎమర్జెన్సీపై నిర్ణయం తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఆక్సిజన్ సరఫరా, అత్యవసర ఔషధాల పంపిణీ, కోవిడ్పై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై కొరడా ఝలిపించడం సహా తదితరాలను తమ అధీనంలోకి తీసుకునే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇప్పటికిప్పుడు ఎమర్జెన్సీ విధించే విషయంలో కేంద్రం పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారు. మరో వారం రోజుల తరువాత దీనిపై తుది నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది.