ఐపీఎల్లో (IPL 2021) ఆడితే బ్యాంకు ఖాతాలు నిండినట్లే. ప్రపంచంలోని క్రికెట్ లీగ్స్లో రిచెస్ట్ లీగ్గా ఇండియన్ ప్రీమియర్ లీగ్కు పేరున్నది. కరోనా కారణంగా ఈ సారి ఇండియాలోనే బయోబబుల్లో (Biobubble) ఐపీఎల్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ సారి ఐపీఎల్ నుంచి ఒక్కో ఆటగాడు మధ్యలోనే స్వస్థలాలకు తిరిగి వెళ్లిపోతుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నది. కరోనా భయమో.. బయోబబుల్లో ఉండలేక పోతున్నారో తెలియదు కానీ.. వ్యక్తిగత కారణాలంటూ విదేశీ క్రీడాకారులు నెమ్మదిగా జారుకుంటున్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా ప్లేయర్లు ఐదు మ్యాచ్లు ముగిసిన వెంటనే ఇక ఆడలేమంటూ చేతులెత్తేస్తున్నారు. ఆదివారం రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు ఆండ్రూ టై జట్టును వదిలి ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. ఇక హైదరాబాద్తో మ్యాచ్ అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ కూడా వెళ్లి పోయాడు. తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) ఆటగాళ్లు ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్సన్ ఐపీఎల్ నుంచి ఔట్ అయ్యారు. వ్యక్తిగత కారణాల వల్ల ఐపీఎల్ ఆడలేకపోతున్నామని చెప్పి వీరిద్దరూ ఆస్ట్రేలియాకు పయనం అయ్యారు. ఈ విషయాన్ని ఆర్సీబీ యాజమాన్యం ధృవీకరించింది.
అడమ్ జంపా ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇప్పటి వరకు ఆర్సీబీ 5 మ్యాచ్లు ఆడగా జంపా బెంచ్ పైనే ఉన్నాడు. కేన్ రిచర్డ్సన్ ఈ సీజన్లో కేవలం ఒకే మ్యాచ్ ఆడాడు. వీరిద్దరితో కలిపి ఐపీఎల్ నుంచి వెళ్లిపోయిన ఆస్ట్రేలియా ప్లేయర్ల సంఖ్య మూడుకు చేరుకుంది. 'అడమ్ జంపా, కేన్ రిచర్డ్సన్ వ్యక్తిగత కారణాల వల్ల ఆస్ట్రేలియాకు వెళ్లిపోతున్నారు. ఈ సీజన్లో మిగతా మ్యాచ్లకు అందుబాటులో ఉండరు. వారి నిర్ణయాన్ని ఆర్సీబీ మేనేజ్మెంట్ గౌరవిస్తున్నది. వారికి పూర్తి సహకారం ఉంటుంది' అని ఆర్సీబీ ట్వీట్ చేసింది. ఒక్కో ప్లేయర్ వెళ్లిపోతుండటంతో మిగతా ఆటగాళ్లలో కూడా ఆందోళన పెరుగుతున్నది. ఇండియాలో రోజు రోజుకూ కేసులు పెరుగుతుండటంతోనే ఆటగాళ్లు ఇళ్లకు వెళ్లిపోతున్నారనే వాదన ఉన్నది. ఫస్ట్ లెగ్ మ్యాచ్ల తర్వాత ఇతర నగరాలకు పయనం అవుతున్న సమయంలో ముగ్గురు బయోబబుల్ వీడటం చర్చనీయాంశంగా మారింది.