కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పెద్ద ఆవుటపల్లిలో కరోనా మహమ్మారి సోకి తగ్గదనే భయంతో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన రామనబోయిన వెంకట లక్ష్మణరావు అనే వ్యక్తి గత మూడు రోజులు క్రితం అనారోగ్యంగా ఉండడంతో కోవిడ్ టెస్ట్ చేయించాడు. రిపోర్టులో పాజిటివ్ రావడంతో హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నాడు.
అయితే శుక్రవారం రాత్రి కరోనా వైరస్ వల్ల శ్వాస తీసుకోవడంలో కొంత ఇబ్బంది పడడంతో వైరస్ బారినుండి బయటపడలేనని మనస్థాపానికి గురై శనివారం తెల్లవారుజామున ఇంటి ఆవరణలో ఉన్న నీటి ట్యాంక్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయాన్నే లేచి కుటుంబ సభ్యులు చూడగానే మృతదేహం ట్యాంక్ లో తేలడంతో పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఆత్కూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసేందుకు చర్యలు చేపట్టారు.