అమరావతి: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కరోనా విలయతాండం సృష్టిస్తున్నది. కరోనా బారినపడి మృతిచెందుతున్న సచివాలయ ఉద్యోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. ఇప్పటికే ఇద్దరు మరణించగా, ఇవాళ మరో ఉద్యోగి మృతిచెందారు. పంచాయతీరాజ్ శాఖ సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్న శాంత కుమారి సోమవారం ఉదయం కరోనా వల్ల చనిపోయారు. రెండురోజుల క్రితమే ఆమె భర్త కూడా కరోనాతో మృతిచెందారు. ఆయన కూడా సచివాలయ ఉద్యోగి కావడం గమనార్హం. దీంతో గత మూడు రోజుల్లో ముగ్గురు ఉద్యోగులు మృతిచెందినట్లయ్యింది. ఈనేపథ్యంలో సచివాలయానికి రావడానికి ఉద్యోగులు జంకుతున్నారు. తమకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. జీఏడీలో సెక్షన్ ఆఫీసరుగా పని చేస్తున్న జి. రవికాంత్ ఆదివారం కరోనాతో మృతిచెందిన విషయం తెలిసిందే.
ఏపీలో కొత్తగా 6,582 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,62,037కు చేరింది. అందులో 9,09,941 మంది కోలుకొని డిశ్చార్జి కాగా, 44,686 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 22 మంది మృతి చెందారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 7,410కి చేరింది.