ఆశ్రయం పొందిన అక్కాచెల్లెళ్ల పై ఓ ఇంటి యజమాని వక్రబుద్ధి బయటపెట్టాడు. పెళ్లి చేసుకోవాలని వేధించాడు. ఈ తతంగం అంతటికి అతడి రెండో భార్య సహకారం కూడా తోడైంది. దీంతో ఈ విషయం ఎవరితో చెప్పుకోవాలో తెలియక ఆ అక్కాచెల్లెళ్లు నరకం అనుభవించారు. చివరకు బాధితుల్లో ఒకరు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కాకినాడ రూరల్ లోని ఓ గ్రామానికి చెందిన 28, 24 ఏళ్ల అక్కాచెల్లెలు తమ ఆర్థిక ఇబ్బందుల కారణంగా కాకినాడ అశోక్నగర్లో ఉంటున్న మడికి రాజేశ్వరదయాళ్, రెండో భార్య స్వాతి వద్ద ఉంటున్నారు. సుమారు 10 ఏళ్లుగా అక్కడే ఉంటూ చదువుకుంటున్నారు. కొంత కాలం మంచివాడిలా నటించిన రాజేశ్వరదయాల్.. ఆతర్వాత తనలోని మరో రూపాన్ని ప్రదర్శించడం మొదలు పెట్టాడు. తన కోరిక తీర్చాలని, పెళ్లి చేసుకోవాలని ఆ అక్కాచెల్లెళ్లను వేధించడం మొదలు పెట్టాడు. తన మాట వినకుంటే చంపేస్తానని భయపెట్టాడు. అతడి చర్యలకు రెండో భార్య కూడా సహకరించేదు. దీంతో ఈ విషయం బయటకు చెప్పుకోలేక ఆ ఇద్దరు మానసికంగా క్షోభకు గురయ్యారు. అతడి వికృత చేష్టలకు భయపడిపోయిన ఆ యువతులు స్వగ్రామానికి తిరిగి వచ్చేశారు. బాధితుల్లో ఒక యువతి పోలీసులను ఆశ్రయించడంతో తిమ్మాపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. బాధితురాలి ఫిర్యాదుతో ఆ భార్యాభర్తలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.