కృష్ణా జిల్లాలో పనిచేస్తున్న జె.పద్మావతి. ప్రస్తుతం అవనిగడ్డ మండలం బందలాయి చెరువు ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. పద్మావతిని అందరూ 'రూపాయి టీచర్' అని ముద్దుగా పిలుస్తారు. రోజూ పిల్లలకు రూపాయి ఇచ్చి విద్యాబుద్ధులు నేర్పుతారు. గతంలో అవనిగడ్డ మండలం గుడివాకవారి పాలెం పాఠశాలలో పనిచేసిన పద్మావతి.. బడిలో ఆరుగురు విద్యార్థులు ఉండటం గమనించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలనుకుని ఓ మంచి ఆలోచనకు శ్రీకారం చుట్టారు. పిల్లల పేరు మీద రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ) అకౌంట్ తెరిచి, ప్రతి విద్యార్థి పేరుమీద రోజుకు రూపాయి చొప్పున.. నెలకు రూ. 30 జమచేయాలని భావించారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసి తమ పిల్లలను పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఆ టీచర్ మీద నమ్మకంతో అమ్మానాన్నలు తమ పిల్లలను బడిలో చేర్పించారు. అలా ఆరుగురు కాస్తా 45 మంది అయ్యారు. పద్మావతి 30 శాతం జీతాన్ని విద్యార్థుల భవిష్యత్తు కోసమే ఖర్చు చేస్తున్నారు. పొదుపు ఖాతాల్లో డబ్బులు జమచేయడమే కాకుండా పిల్లలకు అవసరమైనప్పుడు పుస్తకాలు, పెన్నులు అందజేస్తున్నారు. ఆమె కృషిని విద్యార్థుల తల్లిదండ్రులు, తోటి ఉపాధ్యాయులు కొనియాడుతున్నారు.