ముంబై: భారత మహిళా క్రికెటర్లకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. మిథాలీ రాజ్ నేతృత్వంలోని టీమిండియా ఐసీసీ వరల్డ్కప్ ఫైనల్లో ప్రవేశించిన విషయం తెలిసిందే. హోస్ట్ ఇంగ్లండ్ టీమ్తో ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగనున్నది. అయితే ఫైనల్లో ప్రవేశించిన మహిళా క్రికెటర్లపై బీసీసీఐ ప్రత్యేక నగదు పురస్కారాన్ని ప్రకటించింది. వరల్డ్కప్లో ఆడిన ప్రతి ప్లేయర్కు రూ.50 లక్షల క్యాష్ రివార్డును ఇవ్వనున్నది. ఈ విషయాన్ని ఇవాళ క్రికెట్ కంట్రోల్ బోర్డు తెలిపింది. టీమిండియాతో వెళ్లిన సపోర్ట్ స్టాఫ్కు కూడా ఒక్కొక్కరికి రూ.25 లక్షల నగదు ఇవ్వనున్నారు.
బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా నగదు నజరానా విషయాన్ని వెల్లడించారు. ప్రతి మ్యాచ్ ద్వారా టీమ్ పరిణితి చెందుతోందన్నారు. మిథాలీ సేన పట్ల గర్వంగా ఉందని, ముఖ్యంగా కౌర్ ప్రదర్శన ఆకట్టుకుందన్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో హర్మన్ప్రీత్ కౌర్ అజేయంగా 171 రన్స్ చేసిన విషయం తెలిసిందే. వుమెన్స్ వరల్డ్కప్ ఫైనల్లో టీమిండియా ప్రవేశించడం ఇది రెండవసారి. 2005లో టీమిండియా ఫైనల్కు వెళ్లింది. అప్పుడు ఆస్ట్రేలియా చేతిలో మనోళ్లు ఓడిపోయారు. ఆ జట్టులో ఆడిన మిథాలీ రాజ్, జూలన్ గోస్వామిలు ఇప్పుడు కూడా టీమ్లోనే ఉన్నారు. లార్డ్స్ వేదికగా రేపు ఫైనల్ జరగనున్నది.