ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల హతం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 15, 2017, 11:59 AM

జమ్ము కశ్మీర్‌లోని త్రాల్‌ సమీపంలోని సతోరా ప్రాంతంలో శనివారం (జులై 15) ఉదయం.. ఉగ్రవాదులకు, భారత జవాన్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్న భద్రతా దళాలపై లష్కరే ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఎదురుదాడికి దిగిన జవాన్లు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు.


ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇటీవల అమర్‌నాథ్‌ యాత్రికులపై విరుచుకుపడి ఉగ్రవాదులు.. ఏడుగురు యాత్రికులను పొట్టన పెట్టుకున్న ఘటన నేపథ్యంలో భద్రతా బలగాలు గాలింపును ముమ్మరం చేశాయి.


మరోవైపు భద్రతా బలగాలు, జమ్ము కశ్మీర్ పోలీసులు ఈ ఏడాది ఇప్పటివరకూ హతమార్చిన ఉగ్రవాదుల సంఖ్య 102కు చేరింది. గత ఏడేళ్లలో ఇదే గరిష్టం కావడం గమనార్హం. దక్షిణ కశ్మీర్ ప్రాంతాలైన పుల్వామా, షోపియాన్, అనంతనాగ్ జిల్లాల్లో ఎన్‌కౌంటర్ ఘటనలు ఎక్కువగా చోటు చేసుకున్నాయి. వీటితో పాటు ఉత్తర కశ్మీర్‌లోని బందిపోరా, కుప్వారా.. మధ్య కశ్మీర్‌కు చెందిన బుద్గాంలోనూ ఈ ఘటనలు ఎక్కువగా నమోదయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com