ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి కరోనా మహమ్మారి పైనే ఉంది. వైద్యులందరూ కరోనా పైనే ఫోకస్ చేశారు. దీంతో ఇతర దీర్ఘకాలిక వ్యాధుల పట్ల వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. వైద్యవిభాగమంతా కరోనా నియంత్రణపై దృష్టి సారించిన నేపథ్యంలో టీబీ, మలేరియాలను 2030 నాటికల్లా కట్టడి చేయాలన్న లక్ష్యం నెరవేరేలా కనిపించడం లేదు.
దీంతో రాబోయే ఐదేళ్లలో టీబీ మరణాల రేటు 20 శాతం, మలేరియా మరణాల రేటు 36 శాతం మేరకు పెరిగే అవకాశాలున్నాయని వైద్య రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్ లో కూడా టీబీ, మలేరియా కేసులు ఎక్కువగానే నమోదవుతున్నాయి. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా టీబీ, మలేరియా బాధితుల సంఖ్యను 80 శాతం తగ్గించాలని, ఈ వ్యాధుల కారణంగా సంభవించే మరణాలను 90 శాతం వరకూ తగ్గించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. అయినప్పటికీ గడచిన ఐదేళ్లలో అనుకున్నంత స్థాయిలో ఫలితాలు రాలేదని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం కోవిడ్-19 కట్టడిపై అందరూ దృష్టి పెట్టిన నేపథ్యంలో టీబీ, మలేరియా నియంత్రణ లక్ష్యానికి గండిపడే అవకాశాలున్నయని లాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ నివేదికలో వెల్లడయ్యింది. గడచిన ఐదేళ్లలో భారత్ లో మలేరియా అదుపునకు తీసుకున్న చర్యలు ఫలితమివ్వడం లేదని తెలుస్తోంది. కొత్త వైరస్ తో పాటు ఇతర వ్యాధుల పట్ల కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని వైద్య శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.