ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జయలలిత వాడిన కుర్చీలో పళనిస్వామి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 21, 2017, 01:03 AM

 -పదవీ బాధ్యతలు స్వీకరించి, ఐదు కీలక దస్త్రాలపై సంతకాలు చేసిన పళనిస్వామి


 -పళనికి అప్పుడే కష్టాలు


 -బల నిరూపణ చెల్లదంటున్న నిపుణులు


చెనై్న : తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామి పూర్తి స్థాయిలో పాలన మీద దృష్టి సారించారు. ఐదు నెలల తరువాత తొలిసారి జయలలిత కార్యాలయానికి వెళ్లి ఆమె వాడిన కూర్చీలోనే కూర్చున్నారు. జయ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ఆ కుర్చీలో ఎవరూ కూర్చోలేదు. పన్నీర్‌ ముఖ్యమంత్రి అయినా జయ మీద ఉన్న గౌరవంతో ఆ కార్యాలయానికి ఆయన దూరంగా ఉన్నారు. ఇప్పుడు జయ లేకపోవడంతో, పళనిస్వామి మాత్రం ఆ సెంటిమెంట్లను పట్టించుకోలేదు. నేరుగా కార్యాలయానికి వెళ్లి, జయ కుర్చీలో కూర్చొని, కొన్ని ఫైళ్లపై సంతకాలు కూడా చేశారు. అయితే, బాధ్యతలను స్వీకరించే సమయంలో మాత్రం జయలలిత ఫోటోను టేబుల్‌పై పెట్టుకున్నారు.


 తమిళనాడు ముఖ్యమంత్రిగా ఇటీవలే ప్రమాణ స్వీకారం చేసిన ఎడప్పాడి కె పళనిస్వామి అసెంబ్లీలో జరిగిన బల పరీక్షలోనూ నెగ్గిన విషయం తెలిసిందే. దీనితో సోమవారం ఉదయం రాష్ట్ర సచివాలయానికి వచ్చిన ఆయన మొదట అక్కడ అమ్మ జయలలిత ఫోటో వద్ద నివాళులు అర్పించారు. అనంతరం పదవీ బాధ్యతలు స్వీకరించి, ఐదు కీలక దసా్తల్రపై సంతకాలు చేశారు. మహిళలకు ఉపయోగపడే కార్యక్రమాలను ప్రారంభించారు. మహిళలకు 50 శాతం రాయి తీతో ద్విచక్ర వాహనాలను అందించే పత్రాలపై సంతకం చేశారు. రాష్ట్రంలోని 500 మద్య దుకాణాల మూసివేత దస్త్రంపై, మహిళల ప్రసూతి సాయాన్ని రూ.12000 నుంచి 18000 వరకు పెంచే దస్త్రంపై సంతకాలు చేశారు. నిరుద్యోగ యువతకు ఇచ్చే నెలసరి భత్యాన్ని రెట్టింపు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


 రెండు రోజుల క్రితం తీవ్ర ఉద్రిక్తత, ఆందోళన మధ్య తమిళనాడు అసెంబ్లీ లో జరిగిన పళనిస్వామి బల నిరూపణ చెల్లదని, కోర్టుకు వెళితే అది రద్దయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ నిపుణులు వ్యాఖ్యానించారు. అధికార పార్టీ తరువాత అత్యధిక ఎమ్మెల్యేలు ఉన్న డీఎంకే రహస్య వోటింగ్‌ జరపాలన్న డిమాండ్‌ను తెరపైకి తేగా, దాన్ని స్పీకర్‌ ధనపాల్‌ పట్టించుకోలేదని తమిళ అసెంబ్లీ మాజీ స్పీకర్లు సేడపట్టి ముత్తయ్య, ఆవుడయప్పన్‌ విమర్శించారు. సభలో జరిగిన ఘటనలు నియమాలకు వ్యతిరేకమేనని, స్పీకర్‌ పక్షపాతంగా వ్యవహరించారని అన్నారు. కువత్తూరులో ఎమ్మెల్యేలు ఎలా ఉన్నారో అసెంబ్లీలోనూ అలానే ఉన్నారని, అంత మాత్రాన రిసార్టులోనే బల నిరూపణ పూర్తి చేయాల్సిందని ముత్తయ్య ఎద్దేవా చేశారు. బల పరీక్షను రద్దు చేసి, అన్నా డీఎంకే ప్రభుత్వాన్ని కూడా రద్దు చేయాలని డిమాండ్‌ చేసిన ఆయన, అధికార పక్షానికి వెన్నుదన్నుగా స్పీకర్‌ నిలవడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని అన్నారు. ఈ పరీక్ష చట్ట విరుద్ధమని, స్పీకర్‌ తీర్పును కోర్టులో సవాల్‌ చేస్తే, అది రద్దయ్యే అవకాశాలే అధికమని మాజీ ఉప సభాపతి వీపీ దురైసామి వ్యాఖ్యానించారు. స్పీకర్‌ సభలో లేని వేళ, మార్షల్‌‌స ఎలా లోపలికి రాగలిగారని ఆయన ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com