వయసుకు వచ్చిన వారికి దాదాపుగా గర్భనిరోధక మాత్రలు గురించి తెలిసే ఉంటుంది. గర్భం రాకుండా ఉండటానికి మహిళలు ఈ మాత్రలు వేసుకుంటారు. అయితే వీటి వల్ల చాలా దుష్ప్రభావాలు ఉన్నాయని చాలామందికి తెలియదు. అవాంఛిత గర్భధారణను నివారించడానికి ఇది ఖచ్చితంగా సులభమైన మార్గం. కానీ దీన్ని క్రమం తప్పకుండా వాడటం.. శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా హార్మోన్ల సమతుల్యత లోపం కూడా ఏర్పడుతుందట. ఈ మాత్రలు తీసుకునే ముందు మహిళలు వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యమని వైద్య నిపుణులు చెప్తున్నారు.
25-45 ఏళ్లలోపు మహిళలు ఈ మాత్రలు వాడటం ఇబ్బందేనని పరిశోధనల్లో తేలిందంటున్నారు. అయితే కౌమారదశలో ఉన్నవారు దీన్ని పదే పదే ఉపయోగిస్తే అది వారి పునరుత్పత్తి వ్యవస్థను ప్రభావితం చేస్తుందని సూచిస్తున్నారు. హార్మోన్ల స్థాయిలు లేని యువతులకు ఈ మాత్రలు తీసుకోవడం చాలా ప్రమాదకరమని చెప్తున్నారు. అలాంటి బాలికలు ఎండోమెట్రియోసిస్, పాలిసిస్టిక్ అండాశయ వ్యాధులతో బాధపడతారని స్పష్టం చేస్తున్నారు. గర్భధారణ సమయంలో కూడా అనేక సమస్యలు ఎదురవుతాయని వైద్యులు సూచిస్తున్నారు.
గర్భనిరోధక మాత్రలు గర్భాశయం కంటే ఫెలోపియన్ ను ప్రభావితం చేస్తాయి. ఇది అంతర్గత రక్తస్రావం కలిగిస్తుంది. ఈ మాత్రలను రెగ్యులర్ గా వాడటం వల్ల వంధ్యత్వం, రుతుస్రావం సరిగా రాకపోవడం, స్కిన్ అలెర్జీలు వంటి సమస్యలు వస్తాయి. ఈ మాత్రలు శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిలను తగ్గిస్తాయి. అంతేగాక తలనొప్పి, వాంతులు, వికారం, కడుపు నొప్పి మొదలైన సమస్యలు వస్తాయి. ఈ మాత్రలలోని సింథటిక్ హార్మోన్లు అసమతుల్యతకు కారణమవుతాయి. దాంతో వారిలో చికాకు పెరుగుతుంది. వీటిని తరుచూ వినియోగిస్తే.. అది మహిళల ఆరోగ్యానికి మానసికంగా హాని కలిగిస్తుందని చాలా పరిశోధనలు వెల్లడించాయి. కొంతమంది మహిళల్లో బరువు పెరగడానికి కూడా ఈ మాత్రలు కారణమయ్యాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కాబట్టి గర్భనిరోధక మాత్రలు వాడే యువతులు గానీ మహిళలు గానీ వైద్యుడి సలహాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.